Telangana Elections 2023: తెలంగాణలో రాజకీయ పోరు ఆసక్తికరంగా సాగుతుంది. పార్టీల మధ్య పోరు కాస్త నాయకుల మధ్య పోరుగా మారుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో భవిష్యత్ నాయకులుగా కేటిఆర్, రేవంత్ రెడ్డిల మధ్య రాజకీయ పోరు జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీని నడిపించే బాధ్యత కేటిఆర్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మళ్ళీ కేసిఆర్ సిఎంగా ప్రమాణం చేసి.. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటి ఆయన దేశ రాజకీయాల వైపుకు వెళ్ళి.. రాష్ట్ర బాధ్యతలని కేటిఆర్కు అప్పగిస్తారనే టాక్ ఉంది.
అందుకు తగ్గట్టుగానే కేటిఆర్ ఇప్పటినుంచే అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నట్లు కనిపిస్తుంది. కేసిఆర్ వెనుక ఉంటూ వ్యూహాలు రచిస్తూ ప్రత్యర్ధులకు చెక్ పెట్టేలా పనిచేస్తున్నారు. దీని బట్టి చూస్తే బిఆర్ఎస్ పార్టీని ముందుంటూ నడిపించే బాధ్యతని కేటిఆర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
ఇక కేటిఆర్కు పోటీగా కాంగ్రెస్ లో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పని చేస్తున్నారు. ఈసారి బిఆర్ఎస్కు చెక్ పెట్టి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకురావాలని రేవంత్ ఎంతగానో కష్టపడుతున్నారు. అలాగే కేటిఆర్ టార్గెట్ గానే రేవంత్ రెడ్డి విమర్శలు చేస్తున్నారు. అటు కేటిఆర్ సైతం రేవంత్నే టార్గెట్ చేస్తున్నారు. దీని బట్టి చూస్తుంటే తెలంగాణలో కేటిఆర్ వర్సెస్ రేవంత్ అన్నట్లుగా పోరు నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే మొన్నటివరకు బిజేపి అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉన్నప్పుడు.. బండి సంజయ్ వారికి గట్టి పోటీ ఇచ్చేవారు. ఇప్పుడు అధ్యక్షుడుగా వచ్చిన కిషన్ రెడ్డి అంత దూకుడుగా లేని విషయం తెలిసిందే . మొత్తానికి ఎన్నికల సమరం కేటిఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్లు సాగేలా ఉన్నాయి.